Karnataka | ఇదొక అరుదైన సంఘటన.. ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్న ఓ ఎస్సై ఆ పోలీస్ స్టేషన్ బాధ్యతలను కొత్తగా వచ్చిన మరో ఎస్సైకి అప్పగించాడు. ఇందులో అంత వింత ఏముంది? బదిలీ మీద వెళ్లిన ఏ అధికారి అయిన ఇదే చేస్తారు కదా అని అనుకోవచ్చు. కానీ అక్కడే అసలు విషయం మరొకటి ఉంది. అదేంటంటే.. కొత్తగా వచ్చిన ఆ ఎస్సై మరెవరో కాదు.. బదిలీ మీద వెళ్తున్న ఎస్సై కన్న కూతురే! తండ్రి అడుగుజాడల్లో నడిచి ఎస్సై జాబ్ కొట్టిన కూతురు.. ఆ తండ్రి పనిచేసిన పోలీస్ స్టేషన్లోనే తొలి పోస్టింగ్ పొందడం ఇక్కడ మరో విశేషం.
కర్ణాటకకు చెందిన బీఎస్ వెంకటేశ్ దేశంపై ప్రేమతో చిన్నతనంలోనే ఆర్మీలో చేరాడు. సైన్యంలో 16 ఏండ్ల పాటు సేవలందించాడు. రిటైర్మెంట్ తర్వాత 2010లో పోటీ పరీక్షలు రాసి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాడు. దాదాపు 13 ఏండ్ల పాటు వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించాడు. ప్రస్తుతం మాండ్య సెంట్రల్ ఠాణాలో ఎస్సైగా పనిచేస్తున్నాడు. అయితే చిన్నతనం నుంచి తండ్రిని చూసి పెరిగిన వెంకటేశ్ కూతురు బీఎస్ వర్ష ఆయన్నే ఆదర్శంగా తీసుకుంది. తండ్రిలాగే పోలీస్ ఆఫీసర్ కావాలని కన్నది. పోటీ పరీక్షలకు కష్టపడి చదివింది. గత ఏడాది ఎస్సైగా కూడా ఎంపికైంది. ఈ ఏడాది ప్రొబేషనరీగా శిక్షణ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో బీఎస్ వెంకటేశ్కు మాండ్య సెంట్రల్ ఠాణా నుంచి బదిలీ కావడంతో.. వర్షకు అక్కడికే పోస్టింగ్ ఇచ్చారు. దీంతో బీఎస్ వర్షకు ఆమె తండ్రే స్టేషన్ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా బీఎస్ వెంకటేశ్ భావోద్వేగానికి గురయ్యాడు. తన డెడికేషన్, కష్టపడేతత్వం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.