కర్నాటక హోంమంత్రి జ్ఞానేంద్ర మత మార్పిడి నిరోధక బిల్లు (రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2021) ను మంగళవారం శాసన సభలో ప్రవేశపెట్టారు. సభా సంప్రదాయాల ప్రకారం బిల్లును ప్రవేశ పెట్టేందుకు మంత్రికి అనుమతినిచ్చామని, దీనిపై బుధవారం చర్చ ఉంటుందని స్పీకర్ ప్రకటించారు. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బిల్లు ప్రతులను చించేశారు. ఈ బిల్లును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి బసరాజ్ బొమ్మై స్పందించారు. ఈ బిల్లుపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు మంచి అవకాశం దొరికిందని, అయినా వారు దానిని ఉపయోగించుకోవడం లేదని, ఇందులో తమ తప్పు ఏమాత్రమూ లేదని సీఎం పేర్కొన్నారు.