బెంగళూరు, అక్టోబర్ 10: ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే బిగ్బాస్ రియాలిటీ షోలోకి వెళ్లటం కర్ణాటకలో దుమారం రేపుతున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్బాస్ హౌస్లోని ప్రవేశిస్తున్నట్టు షో నిర్వాహకులు ప్రోమో విడుదల చేశారు. దీనిపై పార్టీలు, స్వచ్ఛంద సంస్థలతోపాటు సామాన్య ప్రజలు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వందేమాతరం అనే స్వచ్ఛంద సంస్థ ప్రదీప్పై ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ యూటీ ఖాదర్కు ఫిర్యాదు చేసింది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే, బాధ్యతలను వదిలేసి సొంత ప్రయోజనాలకోసం బిగ్బాస్లోకి వెళ్తున్నారని ఆరోపించింది. ప్రదీప్ను నెటిజన్లు మీమ్స్, జోకులతో ఓ రేంజ్లో ఆడేసుకొంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మరింత దిగజారుడు చర్య అని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. ప్రదీప్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై ప్రదీప్ వివరణ ఇచ్చారు. తాను బిగ్బాస్లోకి కంటెస్టెంట్గా వెళ్లటంలేదని, గెస్ట్గానే వెళ్తున్నట్టు తెలిపారు. తనకు వచ్చే డబ్బును ఓ అనాథ శరణాలయానికి ఇవ్వనున్నట్టు చెప్పారు.