బెంగళూర్ : కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై మంగళవారం పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేపట్టింది. 40పర్సెంట్సర్కార.కాం అనే వెబ్సైట్లో అవినీతిపై సమాచారం అందించాలని, ఫిర్యాదులు నమోదు చేయాలని రాష్ట్ర పౌరులను ఆ పార్టీ కోరింది. ఇక అవినీతిపై చర్చకు సమయం, వేదిక ఖరారు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి సవాల్ విసిరారు.
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం లూటీదారులు, స్కామ్స్టర్లతో నిండిన 40 పర్సెంట్ సర్కార్గా ఆయన అభివర్ణించారు. తాము చేపట్టిన ఈ ప్రచారోద్యమం కన్నడిగులు పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా తమ గళం వినిపించాలని కోరారు. ఈ ప్రచారంలో భాగంగా తమ వెబ్సైట్ను సంప్రదించి అవినీతిపై ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. బెలగావిలో కాంట్రాక్టరు ఆత్మహత్య కేసులో మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నా ప్రభుత్వం ఆయనకు క్లీన్చిట్ ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది.
రూ 4 కోట్ల విలువైన రోడ్డు పనులకు ఈశ్వరప్ప ఆయన అనుచరులు బిల్లులు విడుదల చేయలేదని, తనను 40 శాతం కమిషన్ అడిగారని కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ బలవన్మరణానికి ముందు ఆరోపించిన విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. మంత్రులు అశ్వధ్ నారాయణ్, అరగ జ్ణానేంద్ర, సుధాకర్లు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించింది. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి సాగునీటి ప్రాజెక్టుల నుంచి బీజేపీ రూ 21,473 కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించింది. బీజేపీ పాలనపై పెల్లుబుకుతున్న ఫిర్యాదులను స్వీకరించి వాటిపై పోరాడతామని కాంగ్రెస్ పేర్కొంది.