Karnataka | బెంగళూరు, నవంబర్ 16: అతని పేరు యతీంద్ర.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముద్దుల తనయుడు.. ఆయన ఓ ఎమ్మెల్యే కాదు.. ఎంపీ కాదు.. ఏ స్థాయి ప్రజా ప్రతినిధి కూడా కాదు. కానీ కర్ణాటక ప్రభుత్వంలో చిన్న ఫైల్ కదలాలన్నా యతీంద్ర అనుమతి కావాలట. ఏ అధికారి ఎక్కడికి, ఎప్పుడు బదిలీ కావాలి? ఎవరికి ఏ పదవి ఇవ్వాలి? అనేవి మొత్తం ఈయనే డిసైడ్ చేస్తాడట. ఒకరకంగా యతీంద్ర షాడో సీఎం అని జోరుగా ప్రచారం జరుగుతున్నది. దాన్ని నిజం చేస్తూ బహిరంగంగానే యతీంద్ర ఏకంగా తన తండ్రికి ధమ్కీ ఇస్తున్న వీడియో ఇప్పుడు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. తాను చెప్పిన అధికారులను మాత్రమే బదిలీచేయాలని సీఎం సిద్ధరామయ్యకు యతీంద్ర ఫోన్ చేసి చెప్పడం కాంగ్రెస్ దోపిడీకి సాక్ష్యమని బీజేపీ, జేడీఎస్ దుమ్మెత్తిపోస్తున్నాయి. తన కొడుకు నిర్వాకం బహిరంగంగా కనిపిస్తున్నా.. సిద్ధరామయ్య మాత్రం తమను తాము సమర్థించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
యతీంద్ర ఇటీవల తన తండ్రికి ఫోన్చేశాడు. ‘హలో అప్ప (నాన్న).. వివేకానంద ఎక్కడి నుంచి వచ్చాడు? నేను ఆ పేరు ఇవ్వలేదు. ఫోన్ మహదేవకు ఇవ్వు.. నేను ఇచ్చింది ఐదు పేర్లే..(కొద్ది క్షణాల తర్వాత) మహదేవ.. నువ్వు వేరేది (లిస్టు) ఎందుకు ఇచ్చావు? అది నీకు ఎవరిచ్చారు? ఏది ఏమైనా నేనిచ్చిన నలుగురు ఐదుగురి పని మాత్రమే కావాలి.. అంతే!’ అని హుకుం జారీచేశారు. యతీంద్రతో మాట్లాడిన మహదేవ అనే వ్యక్తి సీఎం సిద్ధరామయ్యకు ఓఎస్డీగా పనిచేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దోపిడీ మొదలుపెట్టేశారనే ఆరోపణలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. వాటికి బలం చేకూరుస్తూ అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్టీ జోరుగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వైఎస్టీ అంటే యతీంద్ర సిద్ధరామయ్య ట్యాక్స్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి ఒకవైపు, కొడుకు ఇంకోవైపు వసూళ్లకు తెగబడ్డారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అధికారుల బదిలీ నుంచి కాంట్రాక్టర్ల వద్ద కమీషన్ల వరకు ఎక్కడా వదలకుండా వసూళ్ల పర్వం కొనసాగుతున్నదని సమాచారం. తండ్రీ కొడుకుల దోపిడీ ఇలా ఉంటే.. మధ్యలో సందులో సడేమియా అన్నట్టు కర్ణాటక డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్ (డీకేఎస్) తనవంతుగా శక్తివంచన లేకుండా దోచుకొంటున్నారని ఆ రాష్ట్ర కాంట్రాక్టర్లే దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రతి కాంట్రాక్టులోనూ డీకేఎస్ ఏకంగా 50 శాతం కమీషన్ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి.
కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ‘40 పర్సెంట్ గవర్నమెంట్’, ‘పేటీఎం సీఎం’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు కూడా వెలిశాయి. బీజేపీ ప్రభుత్వ అవినీతిపై ఆ రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘాలు ఏకంగా రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశాయి. అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి కాంగ్రెస్కు అధికారమిచ్చిన ప్రజలు.. ఇప్పుడైనా తమ జీవితాల్లో ఏమైనా మార్పు వస్తుందేమోనని ఆశపడ్డారు. కానీ పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఏకంగా డిఫ్యూటీ సీఎం డీకే శివకుమారే ప్రతి పనిలోనూ 50 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే నిర్వహిస్తున్న ఐటీ శాఖలో అయితే అవినీతికి అంతే లేదని వార్తలు వచ్చాయి. ఐటీ శాఖ పరిధిలోని కర్ణాటక స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(కేఈవోఎన్ఐసీఎస్)లో అవినీతి రాజ్యమేలుతున్నదని చిరువ్యాపారులు ఏకంగా ధర్నాలకు దిగారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సంగప్ప అనే ఐఏఎస్ అధికారిని ఏరికోరి తీసుకొచ్చి ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఆయన అప్పటికే అనేక అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎండీగా పెట్టడంతో కమీషన్ల దందా ఆకాశాన్ని తాకింది. ఈ సంస్థ పరిధిలో పనిచేసే చిరు వ్యాపారులు సమర్పించే బిల్లుల మొత్తంలో 10-12 శాతం కమీషన్ ఇవ్వందే ఫైల్పై సంతకం పెట్టే ప్రసక్తే లేదని సంగప్ప తెగేసి చెప్తున్నాడని వ్యాపారులు కొద్ది రోజుల క్రితం ధర్నాకు దిగారు. తాను ఈ పోస్టు కొనుక్కొనేందుకు భారీ మొత్తంలో ముట్టజెప్పానని.. మరి ఆ డబ్బును రాబట్టుకోవాలి కదా అని అంటున్నారని కియానిక్స్ వెండార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వసంత్ బంగేరా తెలిపారు. మరి సంగప్పకు ఆ పోస్టు అమ్మిందెవరు? ఎంతకు అమ్మారు? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారుల బదిలీల దందాకు ఈ ఉదంతమే చక్కటి ఉదాహరణ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సీఎం తనయుడి దందాపై కర్ణాటక విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కర్ణాటకకు ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అని జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. యతీంద్ర వీడియో అంశాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ‘రాష్ర్టానికి సీఎం ఎవరు? సీఎం సిద్ధరామయ్య తన కుమారుడికి ఫోన్ చేసి తాను ఏం చేయాలో అడుగుతారా?’ అని ప్రశ్నించారు. ఏ విధమైన అధికారం లేని యతీంద్ర సీఎంకు ఫోన్చేసి ఆదేశాలు జారీచేయటమేంటని బీజేపీ ధ్వజమెత్తింది. తనయుడి నిర్వాకం ప్రపంచం ముందు కనిపిస్తున్నా.. సీఎం సిద్ధరామయ్య మాత్రం తననుతాను సమర్థించుకొనేందుకు ప్రయత్నించారు. తన కుమారుడు ఫోన్ చేసింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్ఆర్) గురించి మాట్లాడటానికేనని, అధికారుల బదిలీల గురించి కాదని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నేతలకు శాపనార్థాలు పెట్టారు.