బెంగళూర్ : కొవిడ్-19 కేసుల పెరుగుదలతో జనం ఆర్టీపీసీఆర్, రేడియాలజీ టెస్టులపై వేలకు వేలు ఖర్చు చేయాల్సి రావడంతో ప్రైవేట్ దవాఖానలు, ల్యాబ్ ల్లో సీటీ స్కాన్, ఎక్స్ రేలకు వసూలు చేసే ధరలపై కర్నాటక ప్రభుత్వం పరిమితి విధించింది. కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రతను గుర్తించేందుకు అవసరమైన ఈ కీలక టెస్టులకు ల్యాబ్ లు అధిక ధరలు వసూలు చేయకుండా కట్టడి చేసింది.
ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ ల్లో సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్ రేలకు వరుసగా రూ 1500, రూ 250కి మించి వసూలు చేయరాదని పరిమితి విధించినట్టు కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ పేర్కొన్నారు. ఇక కర్నాటకలో కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 50,000 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏకంగా 23,706 కేసులు బెంగళూర్ లో వెలుగుచూడగా మహమ్మారి బారినపడి ఒక్కరోజులో 328 మంది మరణించారు.