Crime news : ఇంట్లో తల్లిదండ్రులు నిత్యం గొడవ పడుతుండటంతో 10 తరగతి చదువుతున్న ఓ విద్యార్థి విసిగిపోయాడు. తండ్రి నిత్యం మద్యం సేవించి ఇంటికి రావడం, ఎందుకు తాగి వచ్చావని తల్లి అతనితో గొడవకు దిగడం ఆ ఇంట్లో నిత్యకృత్యంగా మారిపోయాయి. దాంతో విసిగిపోయిన ఆ బాలుడు గడిచిన రెండేళ్లలో పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. చివరికి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని తనువు చాలించాడు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా సాగర్ తాలూకాలోని యదెహల్లి గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు 10వ తరగతి చదువుతున్నారు. మరికొద్ది రోజుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బాలుడు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉరేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పరీక్షల ముందు ఈ ఘటన జరగడంతో బాలుడు పరీక్షల ఒత్తిడి భరించలేక చనిపోయాడా..? లేదంటే మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో విచారణ జరిపారు. అయితే గత కొన్నేళ్లుగా ఇంట్లో తల్లిదండ్రలు నిత్యం గొడవపడేవారని తేలింది. ఈ గొడవలతో విసిగిపోయిన బాలుడు గడిచిన రెండేళ్లలో పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు వెల్లడైంది.
ఈ నెల తొలి వారంలో కూడా తల్లిదండ్రులు ఇద్దరూ తీవ్రంగా గొడవ పడటంతో బాలుడు రైలు కింద పడేందుకు సమీప రైల్వేస్టేషన్కు వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రైలు పట్టాలపైకి వెళ్లిన బాలుడిని స్థానికులు గమనించి పక్కకు తీసుకొచ్చారని, ఆ తర్వాత కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారని వెల్లడైంది.
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా బాలుడు తండ్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దాంతో తల్లిదండ్రుల మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాత పడుకునేందుకు ఇంట్లోకి వెళ్లిన బాలుడు ఉదయం చూసే సరికి ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. కాగా, తమ కొడుకు చదువులో ముందుండే వాడని, పరీక్షల ఒత్తిడి లేదని తల్లిదండ్రులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.