బెంగళూరు, డిసెంబర్ 26: కర్ణాటక బీజేపీ అసంతృప్త ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సొంత పార్టీకి తీవ్ర హెచ్చరికలు చేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరిస్తే.. యెడియూరప్ప నేతృత్వంలోని మునుపటి బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణాన్ని బయటపెడతానని బెదిరించారు.
కొవిడ్ సమయంలో రూ.40 వేల కోట్ల స్కామ్ చోటుచేసుకున్నట్టు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బసనగౌడపై చర్యలు తీసుకోవాలని బీజేపీలోని చాలా మంది డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించారు. ‘వారు(బీజేపీ ప్రభుత్వం) కొవిడ్ సమయంలో పెద్దయెత్తున అక్రమాలకు పాల్పడ్డారు. నోటీసులు ఇచ్చి, నన్ను పార్టీ నుంచి బహిష్కరించనివ్వండి.. వారి అవినీతి బండారం బయటపెడుతా’ అని పేర్కొన్నారు.