బెంగళూరు, మార్చి 31:శ్రీరాముడిని అగౌరవపరిచారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే శరణు సలాగర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం శ్రీరామనవమి సందర్భంగా రాముడి విగ్రహానికి పూల దండ వేసేందుకు బసవ కల్యాణ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన సలాగర్ రాముడి విగ్రహంపైకి ఎక్కారు.
అక్కడ నిలబడి ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు దేవుళ్లను అవమానిస్తున్నారంటూ నెటిజన్లు, కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సలాగర్ చర్య బీజేపీకి ఇబ్బందికరంగా తయారైంది.