బెంగళూరు: సుమారు రూ.439 కోట్ల బ్యాంకు రుణం ఎగవేసినట్లు బీజేపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో ఆయనతోపాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళి (BJP MLA Ramesh Jarkiholi ) రూ.439.07 కోట్ల రుణాన్ని చెల్లించలేదని కర్ణాటక స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఆరోపించింది. బెళగావిలో సౌభాగ్యలక్ష్మి షుగర్స్ లిమిటెడ్ ఏర్పాటు, దాని విస్తరణ కోసం 2013 నుంచి 2017 వరకు రూ.232.88 కోట్లు రుణం పొందినట్లు తెలిపింది.
కాగా, 2023 ఆగస్ట్ 31 నాటికి రూ.439.07 కోట్లు బ్యాంకు రుణం చెల్లించాల్సి ఉందని చామ్రాజ్పేట బ్రాంచ్ మేనేజర్ రాజన్న ముటాశెట్టి తెలిపారు. అంతేగాక బ్యాంకుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బోర్డు సభ్యులను మార్చారని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్షుడు, ఎండీ, డైరెక్టర్ కలిసి బ్యాంకును మోసగించేందుకు ప్రయత్నించారంటూ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళి, మరో ఇద్దరిపై చీటింగ్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.