భూములు ఇచ్చేయాలని బెదిరింపులు
రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం
కర్ణాటకలో అధికార బీజేపీ ఆగడాలు
బెంగళూరు, జూన్ 15: కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ పేద రైతులపాలిట రాబందుగా మారాడు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో కొంత భాగాన్ని తనకు ఇవ్వాలని వేధిస్తున్నాడు. ఎమ్మెల్యే, ఆయన కుమారుల వేధింపులు తట్టుకోలేక ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. వివరాల్లోకి వెళితే.. పేద రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం వ్యవసాయ భూములను ఇచ్చింది. ఓ గ్రామంలో ఒక్కొక్కరికి ఎకరం 15 గుంటల చొప్పున 29 మందికి అందజేసింది. అయితే ఈ భూములపై కన్నేసిన బీజేపీ ఎమ్మెల్యే ఓలేకర్ రైతులను బెదిరించడం మొదలుపెట్టాడు.
ఎకరం ఉంచుకొని మిగిలిన 15 గుంటలు తనకు ఇచ్చేయాలని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు, ఆయన కుటుంబసభ్యులు ముగ్గురు కలిసి పొలంలోనే పురుగుల మందు తాగారు. పక్క పొలంవాళ్లు చూసి వెంటనే దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.