బెంగళూరు, జూలై 13: కర్ణాటకలోని పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ నియామకాల కుంభకోణంలో బీజేపీ నేత దివ్య హగరాగిపై సీఐడీ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.25లక్షలు వసూలు చేసినట్టు చార్జిషీటులో అభియోగాలు మోపారు. ఇటీవల బయటపడిన ఈ స్కాంలో దివ్యను ఇప్పటికే అరెస్టు చేసి విచారించిన విషయం తెలిసిందే. 1,900 పేజీల చార్జిషీట్లో పేర్కొన్న అంశాల ప్రకారం.. ఎస్సై పరీక్ష జవాబు పత్రాన్ని (ఓఎంఆర్ షీట్) అభ్యర్థులకు బదులు సెంటర్ (స్కూల్) సిబ్బందితో నింపిస్తానంటూ ఒక్కో అభ్యర్థి నుంచి ఏకంగా రూ.25 లక్షలు తీసుకున్నట్టు సీఐడీ గుర్తించింది. ఇందుకు స్కూల్ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.4 వేలు ఇచ్చినట్టు తేలింది. 2021 అక్టోబర్ 3న జరిగిన ఎస్సై పరీక్షల్లో ఈ అవకతవకలు జరిగాయి.
స్కూల్ యజమాని కావడంతో..
ఈ స్కాం జరిగిన స్కూల్కు దివ్య యజమాని. పలువురికి దివ్య పాఠశాలలో సెంటర్ పడటంతో మంజునాథ్ మేల్కుండు అనే నీటిపారుదల శాఖ ఏఈ ఆమెను కలిశాడు. ప్రశ్నపత్రం లీక్ చేయడంలో సాయం చేయాలని కోరాడు. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్ కాశీనాథ్ను సంప్రదించి అందుకు ఒప్పుకొన్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి మంజునాథ్ రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే బేరమాడగా చివరకు రూ.25 లక్షలకు డీల్ కుదిరింది. చివరకు విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగంలోకి దిగారు.