బెంగళూరు: బీజేపీ మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టింది. ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో అడ్డదారుల్లో అధికార పీఠాన్ని దక్కించుకునే తన నైజాన్ని మరోసారి బయటపెట్టింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో చతికిల పడ్డ ఆ పార్టీ దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నది. ‘ఆపరేషన్ కమలం’ చేపట్టి గతంలో కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీ.. తాజాగా మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నది. సార్వత్రిక ఎన్నికల్లోపు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. మరోవైపు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.
శనివారం విలేకర్లతో మాట్లాడిన ఈశ్వరప్ప ‘ఆపరేషన్ కమలం 2.0’ గురించి బయటపెట్టారు. ‘బీజేపీలోని సగం మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. నెల రోజుల సమయం ఇస్తున్నా. మీకు దమ్ముంటే ఒక్క ఎమ్మెల్యేనైనా చేర్చుకొని చూపించాలి. సార్వత్రిక ఎన్నికల ముందు లేదా తర్వాత రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీనే ఉండదు. కచ్చితంగా ‘ఆపరేషన్ కమలం 2.0’ ఉంటుంది. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దీన్ని అంగీకరించారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య పొసగడం లేదు. ఇప్పటికే 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారు. త్వరలో కర్ణాటక ప్రభుత్వాన్ని కూలుస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు బీజేపీ జనరల్ సెక్రెటరీ బీఎల్ సంతోశ్ సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వేటాడేందుకు బీజేపీకి ఒక్క రోజు చాలు’ అని ఆపరేషన్ కమలం 2.0 గురించి చెప్పకనే చెప్పారు. కాగా, బీఎల్ సంతోశ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ‘ప్రతిపక్ష నేత, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నియమించాలని సొంతపార్టీ నేతలే ఫిర్యాదులు చేస్తున్నారు. సొంతింటి సమస్యలను పరిష్కరించుకోలేని బీజేపీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంప్రదించి ఏం సాధిస్తారు’ అని కర్ణాటక కాంగ్రెస్ ఎక్స్ వేదికగా విమర్శించింది.