బెంగళూరు, ఏప్రిల్ 30: కర్ణాటకలో నగదు ఏరులై పారుతున్నది. ఎన్నికల్లో పంచేందుకు వివిధ పార్టీలు, నాయకులు తరలిస్తున్న నగదు, వస్తువులను భారీఎత్తున ఎన్నికల అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సీజ్ చేసిన వస్తువులు, నగదు విలువ 300 కోట్ల రూపాయలు దాటిందని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి మనోజ్కుమార్ మీనా ప్రకటించారు. సుమారు 82 కోట్ల విలువైన నగదు, వస్తువులను బెంగళూరులోనే సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో నగదు రూపంలోనే 100 కోట్లు పట్టుబడినట్టు వివరించారు. రాష్ట్ర చరిత్రలో ఇదే ఎక్కువని, రికార్డు స్థాయిలో నగదును పట్టుకున్నట్టు తెలిపారు. గస్తీని పెంచాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు.