Karnataka Assembly Elections | హిజాబ్ అన్నారు. హలాల్ అన్నారు. గుడి దగ్గర ముస్లిం వ్యాపారులు ఉండొద్దన్నారు. ఇంకా ఏవేవో అన్నారు. ఎన్నెన్నో చెప్పారు. కర్ణాటక ఓటరు విన్లేదు!
మోదీ ఏకంగా 12 రోజులు మోహరించారు. 19 సభలు పెట్టారు. 6 అతి భారీ రోడ్ షోలు చేశారు. వంగివంగి కొంగ దండాలు పెట్టారు. కర్ణాటక ఓటరు చూడలేదు!
అమిత్ షా నుంచి యోగి దాకా 128 మంది బీజేపీ మహామహులు. నెలల తరబడి ప్రచారం. పదివేల సభలు… గుళ్లూ, మఠాల ప్రదక్షిణ. కర్ణాటక ఓటరు పట్టించుకోలేదు!
డబులింజన్ సర్కారన్నారు. వేల కోట్ల ప్యాకేజీలు ప్రకటించారు. వందల శంకుస్థాపనలు చేశారు. డజన్ల కొద్దీ ప్రాజెక్టులంటూ ప్రలోభపెట్టారు. కర్ణాటక ఓటరు ఆశపడలేదు!
హిందూమతమన్నారు. కేరళ స్టోరీ సినిమా కతలు చెప్పారు. బజరంగ్ దళ్ను ట్విస్ట్ చేసి ‘బలి’ చేశారు. చాలీసా ఉద్యమాలు నిర్వహించారు. కర్ణాటక ఓటరు మోసపోలేదు!
నకిలీ వీడియోలు చేశారు. సోషల్ మీడియాలో గుప్పుగుప్పున వదిలారు. మనసుల్ని కలుషితం చేసి మనుషుల్ని విడదీయబోయారు. కర్ణాటక ఓటరు మనసు పెట్టలేదు!
నిమ్మళంగా, నింపాదిగా ఆలోచించుకున్నడు. వాళ్లు చెప్తున్నది ఏంది? చేస్తున్నది ఏంది? జరుగుతున్నది ఏంది? తనకు ఒరుగుతున్నది ఏంది? అని తర్కించుకున్నడు. కావాల్సింది ఏమిటో బేరీజు వేసుకున్నడు. తన రాష్ర్టానికి ఏది మంచిదో నిర్ణయించుకున్నడు. సూటిగా, సుత్తి లేకుండాపోయి నీటుగా మీట నొక్కి వచ్చిండు.
కేరళ ఫైల్స్.. కర్ణాటక ఫైర్స్!
మోదీ మ్యాజిక్, మతం మ్యూజిక్.. రెంటికీ షాక్!
ఓటు మాటల బీజేపీ మతం… ఒక్క దెబ్బతో ఖతం!
డబులింజన్ సర్కార్…చెత్తబుట్ట ఖరార్!
కర్ణాటకలో 80 శాతం హిందువులు. 20 శాతం మైనారిటీలు. ఆ హిందువుల్లో కూడా ఎక్కువ మంది మత సంప్రదాయాలను ప్రగాఢంగా విశ్వసించి పాటించేవారు. అయినా… హిందువులకు తాను మాత్రమే టేకేదారునని చెప్పుకొనే బీజేపీకి అధికారం మిగలలేదు. మహామహులు మోదీ, అమిత్ షా, నడ్డా, యోగితో పాటు, సొంత రాష్ట్రమైన కర్ణాటకలో వ్యూహకర్త సంతోష్ సర్వశక్తులూ ఒడ్డినా… ఓటరు సర్వమంగళం పాడారు!
కర్ణాటక ఓటరు జాతికి ఇచ్చిన సందేశం. మతానికి రాజకీయాలకు సంబంధం లేదని, తన రాష్ట్ర ప్రగతికి, తన అభ్యున్నతికి ఉపయోగపడకపోతే, ఏ జాతీయ పార్టీనైనా, ఎంతటివారినైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదని ఇచ్చిన సంకేతం! అభివృద్ధిని మరిచి, అవినీతిలో మునిగి, విద్వేష విభజన రాజకీయాలతో పబ్బంగడిపి, మాయమాటలతో అధికారంలోకి రావచ్చుననే భ్రమలో ఉన్న బీజేపీకి కర్రుగాల్చి పెట్టిన వాత!
దక్షిణాదికి గేట్వేగా భావించే కర్ణాటకలో బీజేపీకి ద్వారాలు మూసుకుపోయాయి. దీంతోపాటే దక్షిణాదిలోనే బీజేపీ కథ ముగిసింది. ప్రగతి చేతనావర్తమైన దక్షిణాదిలో మత రాజకీయాలు సాగవు. మంత్రి హరీశ్రావు చెప్పినట్టు… “దక్షిణాది.. ఇప్పుడు బీజేపీ ముక్త్.. ఇప్పుడూ, ఎప్పుడూ, ఎల్లప్పుడూ! ఇది సౌత్ ఇండియా స్టోరీ”!!
న్యూఢిల్లీ, మే 13: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో బీజేపీ పతనం ప్రారంభమైందని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. రాబోవు పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ కమలం పార్టీకి ఇదే పరాభవం ఎదురవుతుందని, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కర్ణాటక ఫలితాలు ఒక సూచీ వంటివని అన్నారు. దేశంలో మార్పునకు అనుకూలంగా కన్నడ ప్రజలు ఓటు వేశారని, కర్ణాటకలో క్రూరమైన నిరంకుశ రాజకీయాలు ఓడిపోయాయని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ పేర్కొన్నారు. బీజేపీ అహంకారానికి, కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా కన్నడ ప్రజలు నిలిచారని అన్నారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ను కోరుకొనే వారికి ‘బీజేపీ ముక్త్ దక్షిణ భారత్’ ఎదురైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీని ఎద్దేవా చేశారు. అహంభావ ప్రకటనలు ఎప్పటికీ పనికి రావని, ప్రజల బాధలను అర్థం చేసుకోవాలంటూ బీజేపీకి హితవు పలికారు.
ఓటు ఆయుధం ప్రయోగించిన ప్రజలు
కర్ణాటకలో ప్రజల తీర్పుతో బీజేపీ విద్వేష దుకాణం మూతపడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురిచేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, బీజేపీ అవినీతి, హిందీ బలవంతం ప్రయత్నాలను మైండ్లో ఉంచుకొని కర్ణాటక ప్రజలు తమ ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించారని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ విశ్లేషించారు. మత, విద్వేష రాజకీయాలు భవిష్యత్తులో ఇకపై పనిచేయబోవనే విషయాన్ని బీజేపీ తెలుసుకోవాలని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హితవు పలికారు. కర్ణాటక అభివృద్ధికి తాము ఏం చేశామో ఎన్నికల ప్రచారంలో చెప్పుకోలేని బీజేపీ నేతలు.. పనికిమాలిన అంశాలను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.
మత రాజకీయాలకు ముగింపు ప్రారంభం
బీజేపీ పరాభవం.. ఆ పార్టీ మత, అవినీతి, కార్పొరేట్ అనుకూల, మహిళల, యువకుల వ్యతిరేక, సమాజంలో విభజన సృష్టించే రాజకీయాలకు ముగింపు ప్రారంభమైందనే సందేశాన్ని ఇచ్చింది.
-అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు
ఇది ప్రధాని మోదీ ఓటమి
ఇది మోదీ, అమిత్షాల ఓటమే. భజరంగ్ బలి(హనుమంతుడి) గద బీజేపీపైనే పడింది. కర్ణాటకలో జరిగిందే.. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ సరిగ్గా జరుగుతుంది.
-సంజయ్ రౌత్, శివసేన(యూబీటీ) నేత
లోక్సభ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు
వచ్చే లోక్సభ ఎన్నికలకు కర్ణాటక ఫలితాలు ఒక సూచిక. ఇదే బీజేపీ వ్యతిరేక ట్రెండ్ 2024లోనూ కనిపిస్తుంది. ప్రధాని మోదీ ప్రచార తీరును కన్నడ ప్రజలు తిప్పికొట్టారు.
– శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల తీర్పు
ప్రజలు బీజేపీని తిరస్కరించారు. రాష్ట్రంలో బీజేపీ అవినీతి పాలనకు తగిన గుణపాఠం చెప్పారు. ప్రధాని మోదీతో పాటు ఇతర బీజేపీ నేతలు చేసిన తీవ్ర మత విద్వేష ప్రచారాన్ని ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు.
– సీపీఎం పొలిట్బ్యూరో
ఈ ఫలితాలు ఓ అశాకిరణం
ఈ ఫలితాలు ఓ ‘ఆశాకిరణం’ వంటివి. ఇతర రాష్ర్టాల్లోనూ మత రాజకీయాలను తిరస్కరించి, రాష్ర్టాభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్రజలు భవిష్యత్తులో ఓటు వేస్తారని ఆశిస్తున్నా.
-మెహబూబా ముఫ్తీ, పీడీపీ చీఫ్
బీజేపీ ఆ ధైర్యం చేయలేదు
కర్ణాటక ఎన్నికల్లో ఘోర పరాభావంతో బీజేపీ భయపడుతున్నది. జమ్ముకశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే ధైర్యం కేంద్రంలోని బీజేపీ ఇప్పుడు చేయదు.
-ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత
బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా ఓటు
మతాలు, రాజకీయాలను కలగలిపేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు ఓటేశారు.
– నీరజ్, జేడీయూ అధికార ప్రతినిధి
బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది
దక్షిణాది నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది. అలాగే ఈ ఏడాది ఆఖరులో జరిగే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మధ్య భారత్ నుంచి కూడా కమలం పార్టీ గల్లంతవుతుంది.
-దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ నేత
ద్రవిడ భూభాగంలో గల్లంతు
కర్ణాటకలో ఓటమితో ద్రవిడ భూభాగంలో అధికారం నుంచి బీజేపీ తుడిచి పెట్టుకుపోయింది. 2024 ఎన్నికల్లో బీజేపీపై విజయం కోసం భావసారూప్యత పార్టీలు చేతులు కలపాలి.
-ఎంకే స్టాలిన్, తమిళనాడు సీఎం
విద్వేష వ్యూహాలు పనిచేయబోవు
మత, విద్వేష రాజకీయాల వ్యూహాలు ఇకపై పనిచేయబోవనే విషయాన్ని బీజేపీ గుర్తెరగాలి. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఏం చేయకుండా.. పనికిమాలిన అంశాలతో ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రచారం చేశారు.
-కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం
ప్రజలు బహుళత్వం కోరుకొన్నారు
ప్రజలు బహుళత్వం, ప్రజాస్వామ్యం గెలవాలని కోరుకొన్నారు. వారిని అణచివేసేందుకు బీజేపీ చేసే ప్రయత్నాలు ఫలించవు. క్రూరమైన రాజకీయాలు ఓడిపోయాయి.
-మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ సీఎం
విద్వేష దుకాణం మూత
ఇది విద్వేషంపై ప్రేమ సాధించిన విజయం. కర్ణాటక ఎన్నికల్లో ప్రజల తీర్పుతో రాష్ట్రంలో విద్వేష సంత మూతపడి, ప్రేమ దుకాణం తెరుచుకొన్నది.
-రాహుల్, కాంగ్రెస్ అగ్రనేత