అమృత్సర్: నిమ్మకాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మండె ఎండల్లో నిమ్మ రసం తాగడానికి కూడా సామాన్యులు జంకుతున్నారు. దీనిని క్యాష్ చేసుకుందామని అనుకున్నాడో జైలు సూపరింటెండెంట్. ఇంకేముంది జైలులో ఖైదీలకు నిమ్మకాయలు అందిస్తున్నట్లు బిల్లులు సృష్టించాడు. డబ్బుకోసం ప్రభుత్వానికి బిల్లులు పంపించాడు. అయితే జైలులో ఉన్న ఖైదీ రాష్ట్ర మంత్రికి లేఖ రాయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇంకేముంది జైలు అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
గుర్నమ్ లాల్.. అనే ఐపీఎస్ అధికారి పంజాబ్లోని కపుర్తల మోడర్న్ జైలు సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 15-30 తేదీల మధ్య జైలులో 50 కిలోల నిమ్మకాయలు వినియోగించామని, వాటికి కిలోకు రూ.200 చొప్పున మొత్తం రూ.10 వేలకు కొనుగోలు చేశామని ప్రభుత్వానికి బిల్లులు సమర్పించారు. అయితే జైలు అధికారి అవినీతికి పాల్పడుతున్నాడని, తప్పుడు రేషన్ బిల్లులు ప్రభుత్వానికి పంపుతున్నాడని, ఆ బిల్లుల్లో పేర్కొన్న కూరగాయలు తమకు ఒక్కసారిగా వడ్డించలేదని రాష్ట్ర జైళ్లశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్కు ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి విచారణకు ఆదేశించారు.
అవన్నీ తప్పుడు బిల్లులని, అసలు జైలులో ఉన్న స్టాక్కు.. బిల్లులకు పొంతన లేదని, నిబంధనల ప్రకారం ఖైదీలకు ఆహారం అందించడం లేదని, నిమ్మకాయల కుంభకోణానికి పాల్పడినట్లు (lemon scam) విచారణలో తేలింది. దీంతో ప్రభుత్వం జైలు సూపరింటెండెంట్ గుర్నమ్ను సస్పెంట్ చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.