న్యూఢిల్లీ : జీ20 బుక్లెట్లో మొఘల్ చక్రవర్తి అక్బర్పై ప్రశంసలు గుప్పించారని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (kapil Sibal) ప్రస్తావిస్తూ కాషాయ పాలకులు ప్రపంచానికి ఒక ముఖం చూపితే మరో ముఖంతో ఇండియా అదే భారత్ అంటున్నారని దుయ్యబట్టారు. భారత్ : మదర్ ఆఫ్ డెమొక్రసీ పేరుతో ప్రచురించిన జీ20 బుక్లెట్ 38వ పేజీలో అక్బర్ గురించి ప్రస్తావన ఉందని కపిల్ సిబల్ పేర్కొన్నారు.
మంచి పాలన అంటే మతంతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరి సంక్షేమానికి పాటుపడాలి. అలాంటి ప్రజాస్వామిక పంధాను మూడవ మొఘల్ అక్బర్ అనుసరించారని బుక్లెట్ పేర్కొంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ శాంతి, ప్రజాస్వామ్యానికి పాటుపడ్డాడని జీ20 మ్యాగజైన్లో ప్రభుత్వం కితాబిచ్చిందని కపిల్ సిబల్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. దయచేసి నిజమైన మన్ కీ బాత్ గురించి మాకు తెలియచేయండి! అని కేంద్ర ప్రభుత్వంపై సిబల్ విరుచుకుపడ్డారు.
మత వివక్షకు వ్యతిరేకంగా అక్బర్ విశ్వ శాంతిని కాంక్షించారని ఈ బుక్లెట్లో రాసిఉందని ఆయన పేర్కొన్నారు. అక్బర్ ప్రజాస్వామిక తాత్విక చింతన అసాధారణమని, అప్పటికి ఎంతో దూరదృష్టితో కూడిన ఆలోచన అని ఈ పుస్తకంలో ప్రభుత్వం కొనియాడిందని ట్వీట్లో సిబల్ రాసుకొచ్చారు.
Read More :