లక్నో: హిందూ వివాహ చట్టం ప్రకారం.. పెళ్లి కార్యక్రమంలో కన్యాదానం అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. ఆ చట్టం ప్రకారం పెళ్లి వేడుకలో కేవలం సప్తపది సరిపోతుందని కోర్టు వెల్లడించింది. జస్టిస్ సుభాష్ విద్యార్థి నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. అశుతోష్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్పై విచారణ చేపట్టారు. మ్యారేజ్ యాక్టు ప్రకారం కన్యాదానం అవసరమని, ఆ కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వహించలేదని పిటీషనర్ ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో మార్చి 22వ తేదీన కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హిందూ వివాహ చట్టం ప్రకారం సప్తపది అంటే ఏడు అడుగులు నడవడం కీలకమని కోర్టు తెలిపింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే, హిందూ వివాహ పద్దతిలో కన్యాదానం అంత అవసరం లేదని కోర్టు చెప్పింది. కన్యాదానం నిర్వహించలేదని కేసును విచారించలేమని, సీఆర్పీసీలోని సెక్షన్ 311 ప్రకారం సాక్ష్యులకు సమన్లు జారీ చేయలేమని కోర్టు తెలిపింది.