కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె తన ఓటు హక్కును వినియోగించే సందర్భంగా పోలింగ్ బూత్ లోపల ఫొటోలు తీశారన్నది అభియోగం. ఇక ఓటు వేసే సందర్భంలో ఈవీఎం ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కాన్పూర్లోని హడ్సన్ స్కూల్లో మేయర్ ప్రమీలా పాండే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓటు వేస్తున్న వీడియోలను, పోలింగ్ బూత్ లోపలి వీడియోలను వాట్సాప్లో షేర్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా ఓటు గోప్యత దెబ్బతింటుందని, ఆమె ఏ పార్టీకి ఓటు వేశారో అందులో తెలిసిపోతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటున్న సందర్భంలో ఈవీఎం ఫొటోలు తీయడం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా భావిస్తారు.
దీనిపై స్థానిక అధికారులు స్పందించారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ‘హడ్సన్ స్కూల్ పోలింగ్ స్టేషన్లో మేయర్ ఓటింగ్ గోప్యతను ఉల్లంఘించారు. దీంతో సంబంధిత సెక్షన్ల కింద ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం’ అని జిల్లా మేజిస్ట్రేట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.