లక్నో : తన నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న నగదు నుంచి ట్యాక్స్, పెనాల్టీ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కాన్పూర్కు చెందిన వ్యాపారవేత్త పీయూష్ జైన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ)ను కోరారు. కాన్పూర్, కన్నౌజ్లో పీయూష్ జైన్కు చెందిన స్ధావరాల్లో జరిగిన దాడుల్లో డీజీజీఐ రూ 195 కోట్ల నగదు, 23 కిలోల బంగారం, రూ ఆరు కోట్ల విలువ చేసే శాండల్వుడ్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
పన్ను ఎగవేత ఆరోపణలపై అరెస్టయిన జైన్ ప్రస్తుతం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. తాను రూ 52 కోట్ల పన్న ఎగవేతకు పాల్పడ్డానని జైన్ కోర్టుకు తెలిపాడని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమ్రిష్ టాండన్ తెలిపారు. పెనాల్టీ, పన్నుల కింద రూ 52 కోట్లు మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి జైన్కు చెల్లించాలని డీజీజీఐకి సూచించాలని జైన్ న్యాయవాది కోర్టును కోరారు. పన్ను ఎగవేత కింద రాబట్టాల్సిన మొత్తం కింద ఆ నగదును స్వాధీనం చేసుకున్నారని, దాన్ని తిరిగి ఇవ్వరని టాండన్ స్పష్టం చేశారు.