బెంగళూరు: కన్నడ భాష, అంకెలతో ఉన్న చెక్ను సరిగా అర్థం చేసుకోలేని ఎస్బీఐ బ్యాంక్ శాఖ తిరస్కరించింది. దీంతో ఒక వ్యక్తి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో చెక్ను అగౌరవ పరిచి తిరస్కరించిన ఎస్బీఐ బ్యాంక్కు వినియోగదారుల కోర్టు రూ.85,000 జరిమానా విధించింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హుబ్లీలోని ప్రభుత్వ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పని చేస్తున్న వాదిరాజాచార్య ఇనామ్దార్, విద్యుత్ బిల్లు చెల్లింపు కోసం హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్కు ఈ నెల 3న రూ.6,000కు చెక్ ఇచ్చాడు. అయితే ఆ చెక్ను కన్నడ భాషలో నింపాడు. చెక్పై తేదీని కన్నడ అంకెల్లో వేశాడు.
కాగా, హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీకి కెనరా బ్యాంక్లో ఖాతా ఉంది. దీంతో ఆ బ్యాంక్లో డిపాజిట్ చేసిన ఆ చెక్ను క్లియరెన్స్ కోసం హలియాల్లోని ఎస్బీఐ బ్రాంచ్కు పంపారు. ఆ బ్యాంకు శాఖ సిబ్బంది ఆ చెక్ను పరిశీలించారు. చెక్పై తేదీలో సెప్టెంబర్ నెలను సూచించే కన్నడ సంఖ్య తొమ్మిదిని ఆరుగా తప్పుగా అర్థం చేసుకున్నారు. జూన్ నెలలో చెక్ జారీ చేసినట్లుగా భావించి తిప్పి పంపారు.
ఈ నేపథ్యంలో వాదిరాజాచార్య దీనిపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. బుధవారం విచారణ జరిపిన ఆ కోర్టు చెక్ను తిరస్కరించిన ఎస్బీఐ తీరును సేవా లోపంగా పరిగణించింది. కన్నడ భాష, అంకెల్లో రాసిన చెక్ను అగౌరవ పరిచి తిప్పి పంపినందుకు ఆ బ్యాంక్కు రూ.85,177 జరిమానా విధించింది.