చండీగఢ్: పంజాబ్లోని చండీగఢ్కు చెందిన కనిష్కా బిష్త్(17) అనే విద్యార్థిని చదువు పట్ల అంకిత భావం చూపి స్ఫూర్తి చాటింది. తీవ్ర అనారోగ్యం కారణంగా నిమోనియాతో బాధ పడుతూ పది రోజుల పాటు ఐసీయూలో ఉన్న ఆమెకు కొన్ని రోజుల కిందటే వెంటిలేటర్ తొలగించారు.
వైద్యులు, కుటుంబ సభ్యులు వారించినా చండీగఢ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 20న జరిగిన 12వ తరగతి భౌతిక శాస్త్ర వార్షిక బోర్డ్ పరీక్షకు ఆమె చక్రాల కుర్చీలో హాజరయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష రాయడానికి గంట అదనపు సమయం ఇచ్చారు. ఆమె కోసం దవాఖాన వైద్యులు పరీక్ష కేంద్రంలో ఆక్సిజన్ సిలిండర్ను సిద్ధంగా ఉంచారు. తన కూతురు పట్టుదల చూసి గర్విస్తున్నట్టు ఆమె తండ్రి ప్రేమ్ సింగ్ తెలిపారు.