న్యూఢిల్లీ : పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. రైతుల నిరసన కారణంగా ఆయన కాన్వాయ్ ఫ్లై ఓవర్ వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ భద్రతా లోపానికి పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఘటనపై బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించింది. పంజాబ్ను ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా అభివర్ణించింది. ప్రధాని పర్యటనలో భద్రతా లోపం సిగ్గుచేటని పేర్కొంది.
ప్రధానమంత్రి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నాయకుడని, 140 కోట్ల ప్రజల గొంతుకని, ఆయనపై దాడి అంటే దేశంలోని ప్రతి పౌరుడిపై దాడి జరిగినట్లేనంది. ఘటన మన ప్రజాస్వామ్యంపై దాడేనని, పంజాబ్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని పేర్కొంది. వాటిని ఇప్పటికైనా ఆపకపోతే దేశానికి పెద్ద నష్టం తప్పదని ఇస్టాగ్రామ్లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ‘భారత్ స్టాండ్ విత్ మోదీ జీ’ అనే హ్యాష్ట్యాగ్ జోడించగా.. కంగనా స్పందనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.