జైపూర్ : రాజస్ధాన్లోని కరౌలి, జోధ్పూర్లో ఇరు వర్గాల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణల నేపధ్యంలో సీఎం అశోక్ గెహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ విమర్శలు గుప్పించారు. గెహ్లోత్ సర్కార్ పరిస్ధితిని అదుపు చేయలేని పక్షంలో యూపీ నుంచి తాము బుల్డోజర్లను పంపుతామని ఆమె పేర్కొన్నారు.
రాజస్ధాన్ అల్లర్లతో అట్టుడుకుతోందని, హింసను నియంత్రించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కంగనా ప్రజలకు పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మత ఘర్షణలపై విపక్ష బీజేపీ పాలక కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం కాషాయ పార్టీ కుట్రపన్నుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఈద్ సందర్భంగా జోధ్పూర్లో ఓ వర్గం వారు జలోరి గేట్ ప్రాంతంలో జెండాలు ఏర్పాటు చేయగా ఆ ప్రాంతంలో తాము ఎగురవేసిన కాషాయ జెండాను తొలగించారని మరో వర్గం సభ్యులు ఆందోళనకు దిగడం ఘర్షణలకు దారితీసింది. ఈ ఘర్షణలో పోలీసులు సహా 9 మందికి గాయాలయ్యాయి. దీంతో జోధ్పూర్లో కర్ఫ్యూ విధించి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇక కరౌలీలో ఏప్రిల్ 2న ఓ వర్గం నిర్వహించిన బైక్ ర్యాలీపై మరో వర్గీయులు రాళ్లు రువ్వడంతో ఘర్షణలు చెలరేగి 35 మంది గాయాలయ్యాయి.