Kangana Ranaut | హిల్స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Prades)ను గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ వర్షాలకు మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది.
ఈ సందర్భంగా మండి జిల్లాలోని వదర ప్రభావిత ప్రాంతాన్ని బాలీవుడ్ నటి, మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఆదివారం సందర్శించారు. జిల్లాలోని తునాగ్లో వరద బాధితులతో మాట్లాడారు. అనంతరం జిల్లాలో తాజా పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా విపత్తు సహాయక చర్యలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కేంద్ర కేబినెట్లో లేనని, తన వద్ద నిధులు కూడా లేవని పేర్కొన్నారు.
‘నేను కేంద్ర మంత్రివర్గంలో లేను. నా దగ్గర విపత్తు సహాయానికి నిధులుకూడా లేవు’ అంటూ కంగన వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందించేందుకు తాను అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని ఈ సందర్భంగా కంగన తెలిపారు. విపత్తుల సమయంలో మండి ప్రజలకు ఎంపీ అందుబాటులో లేరంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ పర్యటన ఆసక్తికరంగా మారింది.
భారీ వర్షాలకు హిమాచల్ అతలాకుతలం..
భారీ వర్షాలు, విరిగి పడుతున్న కొండ చరియలు, ఆకస్మిక వరదలతో హిల్ స్టేట్ హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) అతలాకుతలమవుతోంది. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి జులై 6 నాటికి దాదాపు 23 ఆకస్మిక వరదలు సంభవించాయి. 19 క్లౌడ్ బరస్ట్లు (cloud burst), 16 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి (landslides). ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 78కి పెరిగినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. ఇందులో వర్ష సంబంధిత ఘటనల్లో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. రోడ్డు ప్రమాదాల్లో 28 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ‘హిమాచల్ ప్రదేశ్లో వర్షాల కారణంగా సంభవించిన ఘటనల్లో జులై 6 నాటికి మొత్తం మరణించిన వారి సంఖ్య 78కి చేరుకుంది’ అని వెల్లడించింది. ఇక ఈ వర్షాలు, వరదల కారణంగా 37 మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మరోవైపు 115 మంది గాయపడ్డారు. ఈ విపత్తు కారణంగా దాదాపు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచాన వేస్తోంది.
భారీ వర్ష సూచన
మరోవైపు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. అదేవిధంగా జులై 8, 9 తేదీల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. సిర్మౌర్, కాంగ్రా, మండి.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. సిమ్లా, సోలన్, హమీర్పూర్, బిలాస్పూర్, ఉనా, కులు, చంబా.. ఈ ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read..
Himachal Pradesh | 23 ఆకస్మిక వరదలు, 19 క్లౌడ్ బరస్ట్లు.. కుండపోత వర్షాలకు హిమాచల్ అతలాకుతలం
Pahalgam Terror Attack | పహల్గాం ఉగ్ర దాడిని ఖండించిన బ్రిక్స్..
PM Modi | భారత్, పాక్ను ఒకే త్రాసులో తూకం వేయలేం : ప్రధాని మోదీ