Kangana Ranaut | బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నది. హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. కంగనాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనెట్ సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యలపై కంగనా స్పందించింది. బ్యాక్గ్రౌండ్, ప్రొఫెషన్ ఏదేమైనప్పటికీ ప్రతి మహిళకు గౌరవం దక్కాల్సిందేనన్నారు. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు.
చండీగఢ్ విమానాశ్రయం వెలుపల కంగనా మీడియాతో మాట్లాడారు. మండిని ప్రపంచవ్యాప్తంగా ఛోటా కాశీగా పిలుస్తారన్నారు. అయితే, కాంగ్రెస్ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తనను ఢిల్లీకి పిలిపించారని.. ఆయనను కలిసిన తర్వాత సమాధానం చెబుతానన్నారు. సుప్రియా.. కంగనా ఫొటోను షేర్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ పెట్టారు. దీనికి కంగనా సైతం ధీటుగా బదులిచ్చింది. ఎన్నో చిత్రాల్లో అనేక విభిన్న పాత్రలు పోషించానని తెలిపింది.
రజ్జో మూవీలో వేష్యగా, తలైవా చిత్రంలో విప్లవ నేతగా వరకు ఎన్నో క్యారెక్టర్లు చేశానని చెప్పింది. మన కూతుళ్లను స్వేచ్ఛగా ఉండనివ్వాలని.. ప్రతి మహిళను గౌరవించాలని కంగనా పేర్కొంది. అయితే, పోస్టుపై సుప్రియా క్లారిటీ ఇచ్చారు. తనకు తెలియకుండా అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యిందని.. తన ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్ అనేక మందికి యాక్సెస్లో ఉందని, ఎవరో ఒకరు ఆ పోస్టు చేసి ఉంటారన్నారు. మహిళలపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయనని నా గురించి తెలిసిన వారికి తెలుసునని సుప్రియా పేర్కొన్నారు.