భోపాల్, డిసెంబర్ 5: మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన నేపథ్యంలో మధ్యప్రదేశ్కు చెందిన ఆ పార్టీ సీనియర్ నేతలు ఈవీఎంల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. చిప్ ఉండే ఏ మెషీన్ను అయినా హ్యాక్ చేయొచ్చని మాజీ సీఎం, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరుపడాన్ని తాను 2003 నుంచి వ్యతిరేకిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ‘భారత ప్రజాస్వామ్యాన్ని హ్యాకర్లు నియంత్రించడాన్ని మనం అనుమతిద్దామా? ఈ ప్రాథమిక ప్రశ్నను అన్ని రాజకీయ పార్టీలు అడగాలి.
కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు దయచేసి మన భారత ప్రజాస్వామాన్ని కాపాడండి’ అంటూ మంగళవారం ఎక్స్లో పోస్టు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం వెనుక ఈవీఎంల హ్యాకింగ్ ఉన్నదని ఆరోపణలు చేసిన దిగ్విజయ్.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న తన ఆరోపణలను నొక్కిచెబుతూ ఎక్స్లో మరో పోస్టు పెట్టారు. కౌంటింగ్కు ముందే ఖచ్రోడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు ఓ బీజేపీ నేతకు ముందే ఎలా తెలుసునని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన అనిల్ ఛజేద్ అనే వ్యక్తి ఫేస్బుక్ ఖాతా పోస్టు, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ఫలితాల పేజీకి చెందిన రెండు స్క్రీన్షాట్లను షేర్ చేశారు. ఫలితాలకు రెండు రోజుల ముందు అనిల్ ఛజేద్ అనే వ్యక్తి చెప్పినట్టు అభ్యర్థులకు వచ్చే ఓట్ల వివరాలు, కౌంటింగ్ తర్వాత ఫలితాల్లో వచ్చిన ఓట్లు దాదాపు ఒకేలా ఉన్నాయని అన్నారు.
బీజేపీ అభ్యర్థికి 93 వేలు, కాంగ్రెస్ అభ్యర్థికి 77 వేలు వస్తాయని డిసెంబర్ 1న పోస్టులో ఛజేద్ తన పోస్టులో రాయగా.. 3న విడుదలైన ఫలితాల్లో బీజేపీకి 93,552, కాంగ్రెస్కు 77,625 ఓట్లు రావడం గమనార్హం. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ ఖర్మ కొట్టిపారేశారు. ఆయన ఈవీఎంలను నమ్మరని, ఆఖరుకు తనను తాను కూడా నమ్మరని ఎద్దేవా చేశారు. కాగా, అనిల్ ఛజేద్కు పార్టీతో సంబంధం ఉన్నట్టు గానీ, లేనట్టు గానీ బీజేపీ స్పందించలేదు.
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల్లో గెలవలేనప్పుడల్లా ఈవీఎంలపై నిందలు వేయడం ప్రతిపక్షానికి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు. ‘గెలిస్తే, వారికి ఈవీఎంలు మంచివి. అదే ఓడిపోతే, వాటిపైనే నిందలు వేస్తారు’ అని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని మరో సీనియర్ నేత, మాజీ సీఎం కమల్నాథ్ పేర్కొన్నారు. ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందంటూ కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. రాష్ట్రంలో పబ్లిక్ మూడ్ కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నదని, అయితే వచ్చిన ఫలితాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్నారు. ‘తమ గ్రామాల్లో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని కొంతమంది నేతలు చెబుతున్నారు. ఇదెలా సాధ్యం?’ అని అన్నారు.