కోల్కతా, జూన్ 11 : తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం రోజురోజుకూ ముదురుతున్నది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సీనియర్ ఎంపీ, పార్టీ విధేయుడు కల్యాణ్ బెనర్జీ తాజాగా అల్టిమేటం జారీచేశారు. మీకు మీ మేనల్లుడు అభిషేక్ కావాలా? పార్టీలోని నేతలు కావాలో తేల్చుకోవాలంటూ దీదీకి స్పష్టంచేశారు. గురువారం ఆయన అభిషేక్ బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సంతకం ఫోర్జరీ కేసు, సీఐడీ సోదాలకు సంబంధించిన కేసు విచారణ జరుగుతుండగా, చివరి నిమిషంలో తనను న్యాయవాదిగా తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ చర్య అవమానకరమైనదిగా వ్యాఖ్యానించారు. ఇటీవల పార్టీలో ఏర్పడిన తిరుగుబాటు సమయంలో మమత వైపే నిలిచిన ఆయన పార్టీ అధినేత్రికి ఆమె మేనల్లుడు ముఖ్యమా, లేక పార్టీ నేతలా అన్న విషయాన్ని తేల్చుకోవాలన్నారు. చివరి నిమిషంలో తనను న్యాయవాదిగా తొలగించిన అభిషేక్ వైఖరి చాలా అహంకారపూరితమైనదని అన్నారు. అతని కారణంగా పార్టీ నాశనమవుతున్నదని, సీనియర్లను ఆయన ఎంతమాత్రం గౌరవించరని అన్నారు. అందుకే మీకు అభిషేక్ కావాలా? మమ్మల్ని వెళ్లనివ్వండి.. మేం కావాలా.. అభిషేక్ను సాగనంపండి అని అల్టిమేటం జారీచేశారు.
టీఎంసీకి మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. తాజాగా గురువారం రాజ్యసభ ఎంపీలు ప్రకాశ్ చిక్ బరైక్, కోయల్ మల్లిక్లు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రిజైన్ చేశారు. దీంతో రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీల సంఖ్య నాలుగుకు చేరుకుంది. పార్టీ లో చీలికలు ప్రారంభమైన తర్వా త నాలుగు రోజుల వ్యవధిలోనే నలుగురు ఎంపీలు రాజీనామా చేశారు. రాజ్యసభలో టీఎంసీకి 13 మంది ఎంపీలు ఉండగా, ఇప్పుడా బలం తొమ్మిదికి తగ్గింది. మల్లిక్ రాజీనామా చేసినట్టు ఆమె కార్యాలయం ప్రకటించగా, తన రాజీనామా లేఖను ప్రకాశ్ చిక్ బరైక్.. రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్కు గురువారం సమర్పించారు. అనంతరం ఆయన బీజేపీ నేత నిశికాంత్ దూబే ఇంటి బయట మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో ప్రజలు టీఎంసీని తిరస్కరిస్తూ బీజేపీకి పట్టంగట్టారని అన్నారు.
వివిధ అరోపణలపై అరెస్ట్ అయిన తృణమూల్ కాంగ్రెస్ నేత జహంగీర్ ఖాన్ అలియాస్ పుష్పను గురువారం పోలీసులు ఫాల్తా ప్రాంతంలో వీధుల్లో నడిపించారు. జహంగీర్ ఖాన్ను వీధుల వెంబడి నడిపించుకుంటూ తీసుకువస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. బెదిరింపులు, ఇతర ఆరోపణలపై సోమవారం నేపాల్ సరిహద్దులో అరెస్టయిన ఖాన్ను డైమండ్ హార్బర్ కోర్టులో హాజరుపర్చగా, ఐదు రోజుల పోలీస్ కస్టడీకి పంపారు.
పార్టీలో తిరుగుబాట్లు చోటుచేసుకున్న క్రమంలో నటుడు, సీనియర్ ఎంపీ శత్రుఘ్న సిన్హా తన వైఖరిని స్పష్టం చేశారు. పార్టీ రెబల్ ఎంపీల జాబితాలో తన పేరు ఉండటాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, మమతా బెనర్జీ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం ప్రకటించారు. తాను పార్టీకి విధేయుడిగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్లో టీఎంసీ విలీనం అవుతుందని ప్రచారం జరుగుతున్న వేళ ఇండియా కూటమి నేతలతో సమావేశమైన మమత తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని బెంగాల్కు చేరుకున్నారు.