Kalpana Soren : ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆదివారం జరిగిన విపక్ష ఇండియా కూటమి మెగార్యాలీలో పాల్గొని ప్రజల గొంతుకను వినిపించామని జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సొరెన్ భార్య కల్పనా సొరెన్ వెల్లడించారు. ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ విపక్ష ఇండియా కూటమికి తమ సంఘీభావం తెలిపామని, ఎన్నికల ముందు హేమంత్ సొరెన్ను అరెస్ట్ చేసిన తీరును ర్యాలీ వేదికగా ఎండగట్టామని చెప్పారు.
చంపై సొరెన్తో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నానని తెలిపారు. హేమంత్ సొరేన్ అక్రమ అరెస్ట్, అనంతర పరిణామాలతో పాటు మహిళలు, గిరిజనుల గొంతును వినిపించామని వివరించారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి జూన్ 4న వెల్లడయ్యే లోక్సభ ఎన్నికల ఫలితాలపై కేంద్రీకృతమైందని అన్నారు.
ఈ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. విపక్ష ఇండియా కూటమి ర్యాలీలో నేతలు మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. విపక్ష సీఎంలు, నేతలను జైళ్లలో నిర్భంధిస్తున్నారని, ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో ప్రత్యర్ధులను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నారని కాషాయ పాలకులపై విమర్శలు గుప్పించారు.
Read More :