ఆర్బీఐ అంతర్గత కమిటీ సిఫారసు
కేంద్రం ఆమోదిస్తే చెలామణీలోకి
న్యూఢిల్లీ, జూన్ 5: మహాత్మా గాంధీతో పాటుగా అబ్దుల్ కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్ ఫొటోలతో నోట్లు ముద్రించాలని ఆర్బీఐ భావిస్తున్నది. దీనిపై ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆర్బీఐ, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. కలాం, ఠాగూర్ ఫొటోలు(వాటర్మార్కు) ఉన్న నమూనా నోట్లను ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ దిలీప్ సహానీకి పంపించినట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం రాసింది. ఠాగూర్, కలాం ఫొటోలను నోట్లపై ముద్రించాలని ఆర్బీఐలోని అంతర్గత కమిటీ సూచించినట్టు తెలిపింది. దిలీప్ సహాని ఎంపిక చేసిన నోట్లను తుది ఆమోదం కోసం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు సమాచారం.
ఇండియాలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గాంధీ మినహా వేరే వాళ్ల ఫొటోలను నోట్లపై ఎప్పుడూ ముద్రించలేదు. నోట్లపై గాంధీ తో పాటు వేరేవాళ్ల ఫొటోలను ముద్రించాలని ఆర్బీఐ ప్రయత్నించడం ఇదే తొలిసారి. గతంలోనూ ప్రయత్నించింది. కానీ అమలు కాలేదు.