MP Keshava Rao | న్యూఢిల్లీ, జూన్ 19: దేశాన్ని, విపక్షాల కూటమిని నడిపించేందుకు రథసారథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమర్థుడని, ఆయన్ను మించిన నాయకుడు మరొకరు లేరని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు తేల్చిచెప్పారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, దేశానికి దిక్సూచిగా మారిందని ఆయన అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే ఏకైక లక్ష్యంగా విపక్షాలన్నీ ఏకమవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. విపక్షాల కూటమి ఏర్పాటుకు అన్ని పార్టీలు సుముఖత చూపుతున్నాయని, చిన్నచిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయని, అవి కూడా సర్దుకుంటాయని తెలిపారు. ప్రాంతీయ పార్టీలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినప్పుడే విపక్షాల ఐక్యత ఫలిస్తుందని చెప్పారు. బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజలను కూటమిలో భాగస్వాములను చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న మనస్తత్వాన్ని వీడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ది స్టేట్స్మ్యాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విపక్ష కూటమి ఏర్పాటు గురించి ఆ యన తన అభిప్రాయాలను పంచుకున్నారు. విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీని మట్టికరిపించేందుకు అన్ని పార్టీలు భిన్నత్వంలో ఏకత్వంలా కలిసి ఉండేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. పార్లమెంటులో భాగమైన రాష్ట్రపతిని ప్రారంభోత్సవ కార్యక్రమంలో విస్మరించడం అంటే రాజ్యాంగాన్ని విస్మరించడమేనని పేర్కొన్నారు. రాష్ట్రపతికి ఓటు వేయలేదని, ఆమె గురించి మాట్లాడే హక్కు లేదని బీజేపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్ను బహిష్కరించలేదన్న విషయాన్ని బీజేపీ గ్రహించాలని సూచించారు.
బీజేపీని గద్దె దించేందుకు ప్రజా ఉద్యమం…
కాంగ్రెస్ కూడా విపక్ష పార్టీలలో ఓ పక్షం మాత్రమేనని ఆ పార్టీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదన్నారు. సీఎంలు కేసీఆర్, మమతాబెనర్జీ, నితీశ్కుమార్ తమ వాదనలను బలంగా వినిపిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ అజేయుడని పునరుద్ఘాటించారు. బలపడుతున్న ప్రతిపక్షాల ఐక్యతే మోదీ పీఠం దిగిపోవాలి అనే నినాదానికి సూచిక అని పేర్కొన్నారు. 60వ దశకం చివర్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటం పురుడుపోసుకున్నట్టే… ప్రస్తుతం బీజేపీయేతర అంశం ప్రజల ఎజెండాగా మారిందన్నారు. తెలంగాణ తనకంటూ ఓ బ్రాండ్ను సృష్టించుకున్నదని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ మాడల్ దేశానికి సూచికగా నిలుస్తున్నదని, గతంలో వెనకబడిన ప్రాంతంగా ఉన్న తెలంగాణ నేడు దేశంలో ధనిక రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా 3.5 లక్షల తలసరి ఆదాయం కలిగి ఉన్నదని చెప్పారు. రైతులకు ఉచిత కరెంటు, ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నదన్నారు. ఆరోగ్య రంగంలో ఘనమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. అన్నీ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ దేశానికి అభివృద్ధి అంటే ఏంటో కేసీఆర్ చూపిస్తున్నారన్నారు. గతంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం మొదలైనట్టే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీని గద్దె దించేందుకు జరుగుతున్న పోరాటంలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతున్నదని తెలిపారు.