న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విమానాల్లో భద్రతా సమస్యలపై మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)తో చర్చించారు. ఈ సందర్భంగా గత నెల రోజుల్లో జరిగిన ఘటనకు సంబంధించి అధికారుల నుంచి వివరణ కోరారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు.
ఇటీవల కాలంలో ఇండియన్ ఏయిర్లైన్స్కు చెందిన విమానాల్లో సాంకేతిక సమస్యలు ఎక్కువయ్యాయి. దీని కారణంగా విమానాలను మళ్లించడం లేదంటే అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం వంటి ఘటనలు పెరిగాయి. గత 48 గంటల్లో మూడు అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమానాలను భారత్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాయి. సాంకేతిక కారణాలతోనే విమానాలను అత్యవసరంగా దింపాల్సిన పరిస్థితి ఎదురైంది.
కరాచీలో ఆదివారం ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయిన కొన్ని గంటల తర్వాత.. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి సైతం ప్రమాదం తప్పింది. కేరళలోని కాలికట్ నుంచి దుబాయి వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా క్యాబిన్లో కాలిన వాసన వచ్చింది. దీంతో వెంటనే విమానాన్ని మస్కట్ వైపు మళ్లించారు. బహ్రెయిన్-కొచ్చి మధ్య ప్రయాణిస్తోన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్లోకి పిచ్చుక ప్రవేశించింది. విమానం కాక్పిట్లో సజీవంగా ఉన్న ఓ పక్షి కనిపించింది.
ఆదివారం షార్జా నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతికలోపం కారణంగా పాకిస్తాన్ కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించడంతో ముందుజాగ్రత్తగా విమానాన్ని కరాచీ వైపు మళ్లించినట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. ప్రయాణికులను హైదరాబాద్కు తరలించేందుకు అదనంగా మరో విమానాన్ని కరాచీకి పంపుతున్నట్లు పేరొంది. రెండు వారాల్లో కరాచీలో దిగిన రెండో భారతీయ విమానమిది. ఇటీవల కాలంలో స్పైస్జెట్ విమానాల్లో ఎనిమిది సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వీటిపై డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రస్తుతం ఆయా ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేస్తున్నది.