కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం నడిచింది. లోక్సభలో సింధియానుద్దేశించి అధీర్ రంజన్ చౌదరి మహారాజా అంటూ సంబోధించారు. ఈ వ్యాఖ్యలకు జ్యోతిరాదిత్య సింధియా ఫైర్ అయ్యారు. ఓ ప్రశ్నను అడిగే సందర్భంగా అధీర్ రంజన్ కేంద్ర మంత్రి సింధియాను మహారాజా అంటూ రెండు సార్లు సంబోధించారు. దీనికి సింధియా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎయిరిండియా విషయాన్ని ప్రస్తావిస్తూ అధీర్ రంజన్ ‘ఇప్పుడంతా ప్రైవేటీకరణ నడుస్తోంది. ఇటు వైపు ఓ మహారాజా.. అటు వైపు ఓ మహారాజా…’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో కేంద్ర మంత్రి సింధియా స్పందిస్తూ… ‘నన్ను ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. నా పేరు జ్యోతిరాదిత్య సింధియా.. నా గతం గురించి అధీర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయనకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. నా పేరు జ్యోతిరాదిత్య సింధియా’ అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.