సీఎం కేసీఆర్ అభినందనలు
సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ రమణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘మీ అపారమైన విజ్ఞానం, అనుభవం మన దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. మీ పదవీ కాలం మొత్తం సవ్యంగా కొనసాగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్ రమణకు లేఖ రాశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐగా) తెలుగువారైన నూతలపాటి వెంకటరమణ ప్రమాణాన్ని స్వీకరించారు. శనివారం రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. దేవుడి సాక్షిగా ఇంగ్లిష్లో జస్టిస్ రమణ ప్రమాణం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్ తదితర ప్రముఖలతోపాటు జస్టిస్ రమణ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు సీజేఐగా ఉన్న జస్టిస్ బోబ్డే శుక్రవారం పదవీ విరమణ చేశారు. కొత్త సీజేఐ జస్టిస్ రమణ వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు పదవిలో కొనసాగుతారు. సీజేగా పదవీ బాధ్యతలు చేపట్టిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ రమణ నిలిచిపోనున్నారు. ఇంతకుముందు జస్టిస్ కోకా సుబ్బారావు (1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు) సీజేఐగా వ్యవహరించారు.
సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ రమణకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి గొప్ప సేవ చేసే అవకాశం తెలుగువ్యక్తికి లభించినందుకు గర్వంగా ఉందన్నారు. జస్టిస్ రమణ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సీజేఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్రావు జస్టిస్ రమణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సీజేఐగా ఆయన పదోన్నతి తెలుగువారందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. జస్టిస్ రమణ పదవీకాలం విజయవంతం కావాలని దేవాదాయ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆకాంక్షించారు. జస్టిస్ రమణ అణగారిన వర్గాలకు మరింత న్యాయం చేకూరుస్తారని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభిలషించారు. ఆయన తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని చాటుతారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. తెలుగువ్యక్తి సీజేఐగా ప్రమాణం చేయడం సంతోషంగా ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. న్యాయనిపుణులుగా చట్టాలపై, రాజ్యాంగ వ్యవస్థపై విశేష అవగాహన ఉన్న జస్టిస్ రమణ పదవికి వన్నెతెస్తారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అభిప్రాయపడ్డారు. జస్టిస్ రమణ తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటుతారని మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
సీజేఐ జస్టిస్ రమణకు తెలంగాణ న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా, న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రమణ నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలోని కోర్టుల్లో ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామని చెప్పారు. కొంతం గోవర్ధన్రెడ్డి, పులిగారి గోవర్ధన్రెడ్డి, సీహెచ్.ఉపేంద్ర, జనార్ధన్, వి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
భారత అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఓ తెలుగు బిడ్డ బాధ్యతలు చేపట్టడం సంతోషదాయకమని, ఆయనకు రాజశ్యామల ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నానని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి పేర్కొన్నారు. జస్టిస్ రమణ స్వస్థలమైన కృష్ణా జిల్లా పొన్నవరంలో పండుగ వాతావరణం నెలకొన్నది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణాన్ని స్వీకరించిన జస్టిస్ ఎన్వీ రమణ.. ఆ వెంటనే పని ప్రారంభించారు. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సుప్రీంకోర్టు కార్యకలాపాల నిర్వహణపై ఆరుగురు సీనియర్ న్యాయమూర్తులతో సమీక్ష నిర్వహించారు. న్యాయమూర్తులు ఆర్ఎఫ్ నారిమన్, యూయూ లలిత్, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, అశోక్భూషణ్, ఎల్ నాగేశ్వర్రావు పాల్గొన్నారు. వీరు మరోసారి సమావేశం కానున్నట్టు అధికారులు తెలిపారు.