న్యూఢిల్లీ, జూలై 12: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి పదోన్నతి పొందారు. ఈ మేరకు కొలీజియం ఇటీవల చేసిన సిఫారసులకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ బుధవారం ట్విట్టర్లో వెల్లడించారు. జస్టిస్ భూయాన్ తెలంగాణ హైకోర్టు, జస్టిస్ భట్టి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు. 2022, జూన్ 28 నుంచి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా కొనసాగుతున్నారు.
భూయాన్కు వీడ్కోలు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లనున్న రాష్ట్ర హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్కు గురువారం హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలకనున్నది. మొదటి కోర్టు హాల్లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు న్యాయమూర్తులు సమావేశం కానున్నారు. అనంతరం హైకోర్టు బార్ అసోసియేషన్ ఆయన్ను సత్కరించనున్నది.