న్యూఢిల్లీ: దేశంలో 5జీ వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ రేడియేషన్ వల్ల పౌరులు, వృక్ష, జంతుజాలానికి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని ఆమె తన పిటిషన్లో వాదించింది. ప్రస్తుతం వాడుతున్న టెక్నాలజీ ఉన్న రేడియేషన్ స్థాయి కంటే 5జీలో 100 రెట్లు ఎక్కువ రేడియేషన్ ఉంటుందని, ఇది మనుషులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని జూహీ స్పష్టం చేసింది. ఈ పిటిషన్ జస్టిస్ హరి శంకర్ ముందుకు రాగా.. ఆయన మరో ధర్మాసనానికి దీనిని బదిలీ చేశారు. దీనిపై జూన్ 2న విచారణ జరగనుంది.
తాను ఆధునిక టెక్నాలజీల అమలుకు వ్యతిరేకం కాదని, అయితే రేడియేషన్ కారణంగా తలెత్తబోయే తీవ్ర పరిణామాల గురించి అందరూ తెలుసుకోవాలని తన పిటిషన్లో జూహీ కోరింది. ఈ 5జీ టెక్నాలజీ కారణంగా ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు సంబంధించి ఆధారాలను కూడా ఆమె కోర్టుకు సమర్పించింది. దీని రేడియేషన్ కారణంగా మనుషుల్లోని డీఎన్ఏ, కణాలు, ఇతర అవయవాలు దెబ్బతింటున్నాయని, క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి బారిన పడుతున్నారని తన పిటిషన్లో జూహీ వాదించింది.
5జీ టెక్నాలజీ అందరికీ సురక్షితమని డిఫెండర్లు నిరూపించాల్సిన అవసరం ఉన్నదని జూహీ చావ్లా అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో అన్నారు. ఈ దిశగా జరిగిన అధ్యయనాల తాలూకు ఫలితాలను కూడా కోర్టుకు ఇవ్వాలని కోరినట్లు ఆ ప్రకటనలో చెప్పారు. ఇండియాలో 5జీ ట్రయల్స్ కోసం ఈ మధ్యే టెలికాం డిపార్ట్మెంట్.. జియోతోపాటు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్ఎల్లకు అనుమతి ఇచ్చింది.