Joshimath | ఉత్తరాఖండ్లో ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన జోషిమఠ్లో భూమి కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్థితి నెలకొంది. దీంతో జోషిమఠ్ కుంగిపోయే, కొండ చరియలు విరిగిపడే ప్రాంతంగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. కాగా, జోషిమఠ్ మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని డెహ్రాడూన్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సంస్థ అధ్యయనంలో తేలింది. జోషిమఠ్ దాని పరిసర ప్రాంతాల్లోని భూమి ఏటా 2.5 ఇంచుల (6.5 సెంటీమీటర్లు) మేర కుంచించుకుపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.
పట్టణంలో మొత్తంగా దాదాపు 4,500 భవనాలు ఉండగా ఇప్పటివరకు 678 భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. భూమి దిగబడటంతో జోషిమఠ్లో భవనాలు బీటలు వారుతున్నట్లు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న భవనాలకు అధికారులు సీల్ వేశారు.
ఇప్పటికే 4000వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎముకలు కొరికే చలికాలంలో జోషిమఠ్ వాసులు వారి ఇండ్ల నుంచి బయటకు వచ్చి తాత్కాలిక ఆశ్రమాలకు వెళ్లారు. మరోవైపు పగుళ్లు ఏర్పడిన ఇండ్లలో నివసిస్తున్న వారు వాటిని వదిలేసి వేరే ఇండ్లలో అద్దెకు ఉండాలని, ఇందుకు గాను 6 నెలల పాటు నెలకు రూ.4,000 చొప్పున అద్దె చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.