డెహ్రాడూన్, జనవరి 19: ఉత్తరాఖండ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం జోషీమఠ్ ఏటా 10 సెంటీమీటర్లు కుంగిపోతున్నదని తాజా అధ్యయనంలో తేలింది. 2018 నుంచి ఈ కుంగుబాటు ప్రారంభమైందని వెల్లడైంది. అరిస్టాటిల్ యూనివర్సిటీ ఆఫ్ థెస్సాలోనికి, యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాస్బర్గ్ శాస్త్రవేత్తలు తాజా ఉపగ్రహ చిత్రాలను పరీక్షించారు. గత నాలుగేండ్లుగా జోషీమఠ్ కింది భూమిలో గురుత్వాకర్షణ అస్థిరత ఏర్పడుతున్నదని గుర్తించారు.
పట్టణంలోని నేలలు నిర్మాణాలకు పనికిరావని వెల్లడించారు. శాస్త్రవేత్తలు ఈ పరిశోధనకు అత్యాధునిక రాడార్ వ్యవస్థను ఉపయోగించారు. ఇంటర్ఫెరోమెట్రిక్ సింథటిక్ అపార్చర్ రాడార్ (ఇన్సార్) టెక్నిక్తో భూ ఉపరితలంపై చిత్రాలను తీశారు. జోషీమఠ్ను ఏ, బీ, సీ, డీ ప్రాంతాలుగా విభజించి పరిశీలించగా, ఏ (తూర్పు భాగం), బీ (పశ్చిమ భాగం) ప్రాంతాలు కిందికి జారుతూ పోతున్నట్టు తేలింది. తూర్పు భాగంలో ఉపరితల స్థానభ్రంశం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఇదిలా ఉండగా, జోషీమఠ్ మాత్రమే కాకుండా ఆ సమీప ప్రాంతంలో 23 అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు కలిగిన ఝారియా, భుర్కుండా, కాపసారా, రాణిగంజ్, తల్చర్ కూడా ఏటా గరిష్ఠంగా 12 సెంటీమీటర్ల మేర కుంగుతున్నాయి.