న్యూఢిల్లీ: అదానీ ఎంటర్ప్రైజెస్పై హిండెన్బర్గ్ రీసర్చ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ అంశం నేపథ్యంలో అదానీ గ్రూపుపై దర్యాప్తు చేపట్టాలని ఇవాళ విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. భారతీయులకు చెందిన కోట్లాది రూపాయాలు ప్రమాదంలో పడ్డాయని మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. విజయ్ చౌక్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదానీ గ్రూపుపై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక అంశంలో పార్లమెంటరీ స్థాయి సంఘంతో విచారణ చేపట్టాలని కోరారు. లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో అదానీ సంక్షోభంపై విచారణ సాగాలని ఆయన డిమాండ్ చేశారు.
అదానీ కంపెనీపై విచారణకు జేపీసీని ఏర్పాటు చేయాలని.. లేదంటే సీజేఐ సమక్షంలో రోజువారీగా పర్యవేక్షణ జరగాలని ఖర్గే కోరారు. ఎల్ఐసీ, ఎస్బీఐతోపాటు ఇతర జాతీయ బ్యాంకుల్లో ప్రజలు కోట్లాది రూపాయాలు ఇన్వెస్ట్ చేస్తున్నారని, అదానీ గ్రూపు సంక్షోభం వల్ల ప్రజలు కోట్లల్లో నష్టం చవిచూసే అవకాశాలు ఉన్నాయని, దీనిపై నిజం తెలియాలంటే, పార్లమెంట్పై చర్చ చేపట్టాలని ఖర్గే కోరారు.
ఇవాళ తొమ్మిది విపక్ష పార్టీలు హిండెన్బర్గ్ రిపోర్ట్పై చర్చ చేపట్టాలని పార్లమెంట్లో డిమాండ్ చేశాయి. అదానీ గ్రూపు ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్నట్లు హిండెన్బర్గ్ తన రిపోర్ట్లో తెలిపింది. దీంతో ఆ రోజు నుంచి షేర్మార్కెట్లో అదానీ సంస్థలు డీలాపడ్డాయి. కోట్లల్లో ఆ గ్రూపు కంపెనీలు నష్టపోతున్నాయి.