జోధ్పూర్: రాజస్థాన్లోని జోధ్పూర్లో ఓ మోడల్ హోటల్ ఆరో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. జోధ్పూర్కు చెందిన గుంగున్ ఉపాధ్యాయ్ ప్రముఖ మోడల్. ఆమె ఉదయ్పూర్లో ఉంటున్నది. శనివారం ఉదయ్పూర్ నుంచి జోధ్పూర్ వచ్చింది. రతనాడ ప్రాంతంలో ఉన్న హోటల్ లార్డ్స్ ఇన్లో రూమ్ కిరాయికి తీసుకున్నది. అదేరోజు రాత్రి హోటల్ టెర్రస్పై నుంచి దూకేముందు.. తన తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది.
దీంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. అయితే వారు హోటల్కు చేరుకునేలోపే ఆమె హోటల్ పైనుంచి దూకేసింది. దీంతో గుంగున్ తండ్రి గణేష్ ఉపాధ్యాయ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించి హోటల్ వద్దకు వచ్చాడు.తండ్రి, పోలీసులు వచ్చేలోపే గుంగున్ హోటల్ ఆరో అంతస్తు నుంచి దూకేసింది.
దీంతో తీవ్రంగా గాయపడిన గుంగున్ను దవాఖానకు తరలించారు. ఆమె కాళ్లు, ఛాతీ వద్ద తీవ్రగాయాలవడంతో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, గుంగున్ ఆత్మహత్య యత్నం ఎందుకు చేసిందో తెలియలేదు. ఆమె స్పృహలోకి వస్తే గాని ఆత్మహత్య యత్నానికి కారణాలు ఏమిటో తెలుస్తాయని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.