న్యూఢిల్లీ, మే 7: జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాజౌరీలోని కాండీ అటవీ ప్రాంతం చెట్ల పొదల్లో ఉగ్రవాదులు పాతిపెట్టిన 5 నుంచి 6 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసినట్టు ఆదివారం కశ్మీర్ జోన్ పోలీస్ ట్విట్టర్లో ప్రకటించింది. రాజౌరీలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు చనిపోయిన సంగతి తెలిసిందే. బాంబు దాడి జరిగిన ఘటనా స్థలానికి సమీపంలోనే మరో బాంబును ఉగ్రవాదులు పాతిపెట్టిన విషయం పోలీసులకు తెలిసింది. పుల్వామా జిల్లాకు చెందిన ఇష్ఫాక్ అహ్మద్ వానీని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా ఐఈడీ బాంబు అమర్చిన సంగతి బయటపడింది. కాండీ అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలు చేపట్టిన సెర్చింగ్ ఆపరేషన్ ఆదివారం కొనసాగింది. శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది చనిపోయాడని, ఉగ్రదాడి జరిగిన ప్రాంతమంతా భద్రతా బలగాల ఆధీనంలో ఉన్నదని, అన్ని దారులు మూసేసి ఉగ్రవేట కొనసాగిస్తున్నామని సీనియర్ సైనిక అధికారి ఒకరు వెల్లడించారు.