ఇటీవల ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన ఉద్యోగి కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్యపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. ఆ ఘటన అత్యంత దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనను విచారించడానికి సిట్ బృందాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ నివేదికను తాము ఓసారి పరిశీలిస్తామని తెలిపారు.
జమ్మూ కశ్మీర్లోని పండిట్లు, ప్రజలు అందరూ అత్యంత సురక్షితంగా వున్నారని ఎల్జీ మనోజ్ సిన్హా ప్రకటించారు. మొత్తానికి చూసుకుంటే అందరూ సురక్షితంగా ఉన్నారని, అయినా.. అప్పుడప్పుడు దురదృష్ట ఘటనలు జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోడానికి తాము ఓ వ్యూహాన్ని అనుసరిస్తున్నామని ఎల్జీ మనోజ్ సిన్హా పేర్కొన్నారు.
జమ్మూ కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు తహసీల్దార్ కార్యాలయంలోని చొరబడి కశ్మీర్ పండిట్ ఉద్యోగిని కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం కార్యాలయంలో ఒక్కసారిగా తుపాకీ కాల్పులతో ఉద్యోగుల మధ్య తోపులాట చోటు చేసుకున్నది. ఆ తర్వాత పలువురు ఉద్యోగులు రాహుల్ భట్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో రాహుల్ భట్ను శ్రీనగర్కు రెఫర్ చేయగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.