లక్నో : యూపీలో యోగి ఆదిత్యానాధ్ సర్కార్పై మంత్రుల్లోనే అసమ్మతి పెల్లుబుకుతోంది. వివిధ కారణాలతో ఇద్దరు మంత్రులు యోగి క్యాబినెట్ నుంచి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. జలశక్తి శాఖ సహాయ మంత్రి దినేష్ ఖతిక్ రాజీనామా చేసేందుకు సంసిద్ధమవగా, పీడబ్ల్యూడీ మంత్రి జితిన్ ప్రసాద తన ఓఎస్డీని బదిలీ చేయడంతో కినుక వహించారు.
ఇక మంత్రి ఖతీక్ తన శాఖలో బదిలీలతో పాటు హస్తినాపూర్లో తన మద్దతుదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో గుర్రుగా ఉన్నారు. ఖతీక్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడంతో పాటు వాహనాన్ని ప్రభుత్వానికి అప్పగించి హస్తినాపూర్లోని తన గృహానికి వెళ్లినట్టు వార్తలు రావడంతో ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గడం లేదని సమాచారం.
పీడబ్ల్యూడీ మంత్రి జితిన్ ప్రసాద తన ఓఎస్డీ అనిల్ కుమార్ పాండే బదిలీ పట్ల యోగి సర్కార్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బుధవారం ఢిల్లీలో కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇద్దరు మంత్రుల మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ఛాప్ చేయడంతో వీరిద్దరూ యోగి క్యాబినెట్ నుంచి వైదొలుగుతారని ప్రచారం జరుగుతోంది. కాగా జితిన్ ప్రసాద, దినేష్ ఖతిక్ రాజీనామాల వార్తలు వదంతులేని యోగి క్యాంప్ చెబుతోంది.