భారత్లో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించిన రిలయన్స్ జియో.. కొంతకాలంగా తడబడుతోంది. ప్రస్తుతం అన్ని టెలికం సంస్థలు అందించే ప్లాన్లు దాదాపు ఒకే ధర ఉండటం.. కొత్త ప్లాన్లు లేకపోవడం.. ఇలా కారణం ఏదైనా సరే టెలికం సంస్థలకు కస్టమర్లు షాకిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే జియోకి కూడా కస్టమర్లు పెద్ద షాక్ ఇచ్చారు.
ఒక్క ఫిబ్రవరి నెలలోనే సుమారు 37 లక్షల మంది యూజర్లు జియోకు వీడ్కోలు చెప్పేశారు. ఈ విషయాన్ని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. ఇలా జియో కస్టమర్లు తగ్గిపోవడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. అంతుకు ముందు రెండు నెలల్లో కూడా ఇలాగే భారీ సంఖ్యలో జియోకు యూజర్లు వీడ్కోలు పలికారు.
అయితే ఇది కేవలం జియోకే పరిమితం కాదు. ఫిబ్రవరిలో ఒక్క జియోనే కాదు వోడాఫోన్ ఐడియా కూడా 15.32 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లలో 1.11 లక్షల మంది ఈ సేవలను వదులుకున్నారు. అయితే వీటన్నింటికీ విరుద్ధంగా భారతీ ఎయిర్టెల్ కంపెనీ మాత్రం ఫిబ్రవరిలో తమ కస్టమర్లను పెంచుకుంది. ఈ నెలలో కొత్తగా సుమారు 16 లక్షల మంది కస్టమర్లు ఎయిర్టెల్ సేవలు తీసుకున్నారని ట్రాయ్ తెలిపింది.