లక్నో : దేశ విభజనకు కారణమైన మహ్మద్ అలీ జిన్నా అనుచరులు పశ్చిమ యూపీలో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ ఆరోపించారు. యోగి గురువారం నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ శంకుస్ధాపన కార్యక్రమంలో మాట్లాడుతూ ఇక్కడి రైతులు గతంలో చెరకును పండించి తీపిని పంచేవారని, కానీ కొందరు ఈ తీపిని హరించేలా ఘర్షణలు ప్రేరేపించారని అన్నారు.
ఇక్కడి చెరుకు తీపిని ఎల్లెడలా వ్యాప్తి చేసే పాలకులు కావాలో, జిన్నా అనుచరుల ఉన్మాదం కావాలో నిర్ణయించుకోవాలని యోగి పిలుపు ఇచ్చారు. కాగా సీఏఏను ఉపసంహరించుకోని పక్షఃంలో యూపీ వీధులు ఢిల్లీలోని షహీన్బాగ్లా మార్చాలని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ పిలుపు ఇవ్వడం, లఖింపూర్ ఖేరిలో రైతుల హింసాత్మక నిరసనల నేపధ్యంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్ధాపన చేశారు. ఈ విమానాశ్రయం రాకతో యూపీలో మెరుగైన మౌలిక వసతులు రావడంతో పాటు ఈ ప్రాంతం లాజిస్టిక్ హబ్గా ఎదిగి యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.