ధన్బాద్: జార్ఖఖండ్కు చెందిన 85 ఏళ్ల సరస్వతి దేవి అగర్వాల్(Saraswati Devi) కల నెరవేరబోతున్నది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె తన మౌన వ్రతాన్ని వీడనున్నారు. అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజే తాను మౌన వ్రతాన్ని వీడనున్నట్లు 1992లో ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు జనవరి 22వ తేదీన జరగనున్న ప్రాణ ప్రతిష్ట కోసం ఆమెకు ఆహ్వానం అందింది. ఇప్పుడు ఆమె కలనెరవేరబోతున్నది. జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన ఆ మహిళ.. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజునే మౌన ముద్రలోకి వెళ్లింది. అయోధ్యలో రామాలయం కట్టిన రోజునే తన మౌన వ్రతాన్ని వీడనున్నట్లు ఆమె ఆ రోజున ప్రతిజ్ఞ పూనారు.
మౌని మాతగా పేరు గాంచిన సరస్వతీ దేవి తమ కుటుంబ సభ్యులతో కేవలం సంకేతాలో కమ్యూనికేట్ అయ్యేది. కొన్ని సందర్భాల్లో ఆమె పేపర్పై భారీ వ్యాఖ్యలు రాసి ఇచ్చేది. అయితే 2020 వరకు ఆమె ప్రతి రోజు కేవలం గంట మాత్రమే మాట్లాడాది. 24 గంటల్లో కేవలం మధ్యాహ్నం ఒక గంట మాత్రమే ఇంట్లోవాళ్లతో మాట్లాడేది. అయితే 2020లో ప్రధాని మోదీ.. అయోధ్య మందిరం కోసం శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఆమె రోజంతా మౌనంగా ఉండడం ప్రారంభించింది.
సోమవారమే ఆమె అయోధ్యకు రైలులో వెళ్లినట్లు ఆమె కుమారుడు 55 ఏళ్ల హరే రామ్ అగర్వాల్ తెలిపారు. జనవరి 22వ తేదీన ఆమె తన మౌనవ్రతాన్ని వీడుతారని ఆయన చెప్పారు. మహంత్ నృత్య గోపాల్ దాస్ సేవకుల తన తల్లికి ఆహ్వానం పలికినట్లు కుమారుడు తెలిపారు. 1986లో భర్త దేవకీనందన్ అగర్వాల్ మృతి తర్వాత సరస్వతీ దేవి తన జీవితాన్ని రాముడికి అంకితం చేసింది. ఎక్కువ సమయాన్ని ఆమె యాత్రలకే కేటాయించినట్లు హరే రామ్ తెలిపారు. రెండో కుమారుడు నంద్ లాల్ అగర్వాల్ వద్ద ప్రస్తుతం సరస్వతి ఉంటోంది.
2001లో మధ్యప్రదేశ్లోని చిత్రకూటలో సుమారు ఏడు నెలల పాటు సరస్వతీ దేవి దీక్ష చేసినట్లు ఆమె కోడలు ఇన్నూ అగర్వాల్ తెలిపారు. సరస్వతీ దేవి తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేస్తుంది. సుమారు ఆరేడు గంటల పాటు ధ్యానం చేస్తుంది. సంధ్యా ఆరతి తర్వాత రామాయణం, భగవద్గీత లాంటి పుస్తకాలను చదువుతుంది. ఆమె రోజు కేవలం ఒక్క సారి మాత్రమే భోజనం చేస్తుందని, ఇక సాయంత్రం, ఉదయం గ్లాసు పాలు తాగుతుందని ఇన్నూ అగర్వాల్ చెప్పింది. అన్నం, పప్పు, రోటీలతో కూడిన వెజ్ డైట్ను ఆమె తీసుకుంటుంది.