న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్నది. సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేక పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోతున్నది. ఇలాంటి తరుణంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లనే ఎక్కువగా వృథా చేయకుడా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం టీకా వృథా విపరీతంగా ఉంటుండటంపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ వృథాను ఒక శాతం కంటే తక్కువే ఉంచాలని కేంద్రం పదేపదే కోరుతున్నా.. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో దాదాపు మూడోవంతు డోసులు నిరుపయోగమవుతున్నాయి.
అత్యధికంగా జార్ఖండ్లో 37.3 శాతం టీకాలు వృథా కాగా, ఛత్తీస్గఢ్లో 30.2 శాతం టీకాలను వృథా చేశారు. ఆ తర్వాత తమిళనాడులో 15.5 శాతం, జమ్మూకశ్మీర్లో 10.8 శాతం, మధ్యప్రదేశ్లో 10.7 శాతం టీకాలు వృథా అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్త సగటు (6.3 శాతం)తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని, రాష్ట్రాలు దీనిపై మరింత దృష్టి పెట్టి వ్యాక్సిన్ల వృథాను నిలువరించాలని సూచించింది.
రాష్ట్రాల దగ్గర ఇంకా 1.77 కోట్ల డోసులు
ఈ ఉదయం 8 గంటల వరకు మొత్తం 22 కోట్లకు (22,00,59,880) పైగా టీకా డోసులను రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 20,13,74,636 డోసులను (వృథాతో కలిపి) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వినియోగించుకోగా.. ఇంకా 1.77 కోట్ల డోసులు వారి వద్ద మిగిలే ఉన్నట్లు తెలిపింది.