రాయ్పూర్: జార్ఖండ్లో అధికార యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష బీజేపీ కుట్ర పన్నడంతో.. అక్కడ రాజకీయ అస్థిరత నెలకొన్నది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అక్రమంగా మైనింగ్ లీజును దక్కించుకున్నాడంటూ బీజేపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును గవర్నర్ ఈసీ పరిశీలనకు పంపగా.. ఈసీ సోరెన్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది.
అయితే, ఈసీ సిఫార్సు చేసినా గవర్నర్ రమేశ్ బాయిస్ ఇంతవరకు సోరెన్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయలేదు. కానీ ఏ క్షణమైనా ఆయన సోరెన్పై వేటు వేసే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సోరెన్ పావులు కదుపుతున్నారు. అధికార యూపీఏ పక్ష ఎమ్మెల్యేలు బీజేపీ వలలో పడకుండా వాళ్లను తన వెంటే పెట్టుకుని తిరుగుతున్నారు.
ఇన్నాళ్లూ జార్ఖండ రాజధాని రాంచిలోనే ఎమ్మెల్యేలను తనతోపాటు ఉంచుకున్న సీఎం హేమంత్ సోరెన్.. తాజాగా వారిని పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్కు తరలించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని మేఫెయిర్ రిసార్ట్కు వారు చేరుకున్నారు. సీఎం సోరెన్ కూడా ఆ ఎమ్మెల్యేలతోపాటే రాయ్పూర్కు వెళ్లారు.