రాంచీ, ఆగస్టు 30: జార్ఖండ్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న వేళ అధికార యూపీఏ కూటమి కీలక నిర్ణయం తీసుకున్నది. బీజేపీ ప్రలోభాల నుంచి రక్షించుకోవడానికి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు తరలించింది. 32 మంది ఎమ్మెల్యేలు సహా మొత్తం 41 మందితో కూడిన విమానం ఒకటి రాయ్పూర్ చేరుకుంది. మంగళవారం సాయంత్రం రాయ్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి మూడు బస్సుల్లో వీరంతా మేఫెయిర్ రిసార్టుకు చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించే సమయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడించాయి.
‘రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు సర్వసాధారణం. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా మేం సిద్ధం’ అని సీఎం హేమంత్ సొరేన్ అన్నారు. బీజేపీ ప్రలోభాల నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి, జార్ఖండ్ను మరో మహారాష్ట్రలాగా కానివ్వకుండా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేఎంఎం పేర్కొంది. కాగా సొరేన్పై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్పై తుది నిర్ణయం తీసుకున్న ఈసీ ఆ నివేదికను రాజ్భవన్కు ఇటీవల పంపించింది. అయితే గవర్నర్ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్నది. 81 సీట్లు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎంకు 30 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 18, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉండగా విపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
బీజేపీది రాజకీయ వ్యాపారం
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడిన సొరెన్ బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీకి ఎమ్మెల్యేలను కొనడం, అమ్మడం మాత్రమే తెలుసునని, అయితే తమకు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడం ఒకటే తెలుసునని అన్నారు. రాజకీయాల్లో వ్యాపారం చేస్తున్న వారికి (బీజేపీని ఉద్దేశిస్తూ) ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని మండిపడ్డారు. సీఎం పదవి గురించి తానెప్పుడూ తాపత్రయపడలేదని, అయితే దళితులు, ఆదివాసీలు, జార్ఖండ్ ప్రజల కోసమే తాను ఆందోళన పడుతున్నట్టు వెల్లడించారు.