Road Accident | జార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హజారీబాగ్ జిల్లాలోని పద్మ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోమి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగిందని హజారీబాగ్ ఎస్పీ మనోజ్ రతన్ పేర్కొన్నారు. ఎదురుగా వస్తున్న బైకర్ను తప్పించబోతున్న సమయంలో ఎస్యూవీ అదుపు తప్పి బావిలో పడిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారని.. మృతుల్లో ఒక చిన్నారి, ఓ మహిళ ఉన్నారని పేర్కొన్నారు. మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీసినట్లు చెప్పారు. మరో ముగ్గురు మహిళలు గాయపడగా.. వారిని రక్షించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.